కరోనా భూతం ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. కరోనా ధాటికి మహమహులే కుప్పకూలుతున్నారు. ఇంటర్నెట్ సృష్టికర్త, అంతర్జాల పితామహుడు (ఫాధర్ ఆఫ్ ఇంటర్నెట్) వింట్ సెర్ప్ను సైతం కరోనా మహమ్మారి విడిచిపెట్టలేదు. అంతర్జాల సృష్టి ద్వారా నెటిజన్లకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన సెర్ప్ ఇప్పుడు కరోనాతో బాధ పడుతున్నాడు.
ప్రస్తుతం వింట్ సెర్ప్ వయస్సు 76 ఏళ్లు. ఇంటర్నెట్ వ్యవస్థకు ముఖ్యమైన టీసీపీ / ఐపీ ప్రొటోకాల్ రూపకల్పనలో సెర్ప్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం వింట్ సెర్ప్ గూగుల్ సంస్థకు ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్నారు. వింట్ తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు ఆయన తెలిపారు.