కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ను మరికొన్ని వారాల పాటు పొడగిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ విషయంలో మాత్రం ఇప్పటికే అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రధాని ప్రకటించిన లాక్డౌన్ ఏప్రిల్ 14వ తేదీతో ముగియనుంది. మరోవైపు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోతుండటంతో ఈ లాక్డౌన్ను మరికొన్ని రోజుల పాటు పొడగించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణా రాష్ట్ర సీఎం కేసీఆర్తో పాటుగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా లాక్డౌన్ను పొడగించాలని కోరుతున్నారు. ప్రస్తుతం కేంద్రం ఈ విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఢిల్లీ మర్కజ్ ఘటన తర్వాత దేశంలో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా లాక్డౌన్ను ఎత్తివేస్తే సమస్య మరింత తీవ్రమవుతుందని పలు రాష్ట్రాల భావిస్తున్నాయి.
లాక్డౌన్ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలు/ప్రభుత్వాలు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా సూచించారు. కరోనా లేని భారత్ కోసం కష్టమైనా కొన్ని రోజులు భరిద్దామని సూచన ప్రాయంగా లాక్డౌన్ పొడగింపు గురించి చెప్పారు. దేశంలో కరోనా వ్యాప్తి, కేసుల పెరుగుదలను సమీక్షించిన తర్వాత లాక్డౌన్ పొడగింపుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు.
దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఇప్పటి వరకూ పాటిస్తూ వచ్చిన లాక్డౌన్ ఓ రకంగా మంచి ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి. ఇతర దేశాలతో పోల్చుకుంటే, మనదేశంలో అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీనికి కారణం మన ప్రభుత్వం ముందస్తుగా లాక్డౌన్ను ప్రకటించడమే. ఈ లాక్డౌన్ను కనీసం మరో రెండు వారాలు పాటు పొడిగించినట్లయితే కరోనా కేసులు భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
ఏదేమైనప్పటికీ.. లాక్డౌన్ పొడగింపుపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ లాక్డౌన్ను పొడగిస్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.