దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారబోతోందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 8వ తేదీ నాటికి ఆ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్గా మారుతుందని అభిప్రాయపడుతోంది.
ఈ తుఫానుకు ఎంఫాన్ అనే పేరును పెట్టారు. ఇది భారత్ను తాకితే ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని అంచనా. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ (ఈసీఎండబ్ల్యూఎఫ్) ప్రకారం, ఈ నెల 13వ తేదీ నాటికి మయన్మార్ వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది.
ఎంఫాన్ తుఫాన్ ఎఫెక్ట్తో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా మత్స్యకారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిసా తీర ప్రాంత జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొన్నారు.