హైదరాబాద్ రోడ్లపై గత వారం రోజులుగా హల్ చల్ చేస్తున్న చిరుత మరోసారి కనిపించింది. ఈనెల 14న నగర శివారులోని కాటేదాన్ అండర్ బ్రిడ్జ్ వద్ద రోడ్డుపై తిరుగుతూ చిరుతపులి కనిపించిన విషయం తెలిసినదే. అయితే అటవీశాఖ అధికారులు ఆ చిరుతను పట్టుకునే లోపే అది పలాయన చిత్తగించి రోడు పక్కనే ఉన్న ఫాంహౌస్లోకి వెళ్లి, ఆ తర్వాత వ్యవసాయ యూనివర్సిటీలోని దట్టమైన పొదల్లోకి పారిపోయింది.
ఈ చిరుత వలన మానవాళికి ఎలాంటి అపాయం సంభవించకుండా ఉండేందుకు గాను దాన్ని సురక్షితంగా పట్టుకోవటానికి అటవీశాఖా అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్సాగర్ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్లోని స్విమ్మింగ్ పూల్లో చిరుతపులి నీళ్లు తాగుతుండగా వాచ్మెన్ గమనించారు.
ఈ విషయాన్ని అధికారుల తెలియజేయటంతో అటవీ శాఖ అధికారులు మరోసారి ఆపరేషన్ చిరుతకు దిగారు. ఇందులో భాగంగానే గార్డెన్లో కుక్కలను వదిలి చిరుత కోసం గాలిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో ఓ బోనుతో పాటుగా సీసీ ట్రాక్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఈసారి ఎలాగైనా చిరుతను పట్టుకోవాలని అధికారులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.